లవ్ స్టోరీలను యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కుటుంబం మొత్తం కలిసి చూసేలా తెరపై అందంగా రూపొందించగల టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి కథానాయికగా తెరకెక్కిన “ఫిదా” చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తరువాత మరో ప్రాజెక్టును చేయడానికి శేఖర్ కమ్ముల చాలా సమయం తీసుకున్నాడు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తన కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. మలయాళ బ్యూటీ సాయి పల్లవి ఈ చిత్రంలో చైతన్యకు జోడిగా నటించనుంది. తాజాగా శేఖర్ కమ్ముల సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో ప్రభుత్వం యురేనియం తవ్వకాలు చేపట్టాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. నల్లమలలో యురేనియం నిల్వలు ఉన్నాయి. ఈ నిర్ణయంపై రాజకీయంగా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా శేఖర్ కమ్ముల నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టవద్దని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. “నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపడితే పర్యావరణానికి తీవ్ర నష్టం. ఆ ప్రాంతంలో చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్నారు. పులులకు, ఇతర అటవీ జంతువులకు నల్లమల అడవులు ఆవాసం. యురేనియం తవ్వకాల వల్ల జంతువులు నాశనం అవుతాయి. కృష్ణ నదితో పాటు, దాని ఉపనదులు కాలుష్యంగా మారుతాయి. క్యాన్సర్ రోగాలు పెరుగుతాయి. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేయకూడదు. ప్రభుత్వం స్పందించి యురేనియం తవ్వకాలపై పునరాలోచించాలి” అని కోరుతూ శేఖర్ కమ్ముల టిఆర్ఎస్ నేత, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు ట్యాగ్ చేశారు.