ఇటీవల విడుదలైన దివంగతనేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం యాత్ర విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది. ప్రేక్షకులు అమితంగా ఆదరిస్తున్నారు. దీనిలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం చేసిన తెలుగు చిత్రం ‘యాత్ర’ విజయవంతంగా నడుస్తుండగా, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, ఈ చిత్రాన్ని చూసి, నిర్మాతలు, దర్శకుడిపై అభినందనల వర్షం కురిపించారు.
రాఘవేంద్రరావు సినిమా చూసిన తరువాత తన ఫేస్ బుక్ ఖాతాలో స్పందిస్తూ, “యాత్ర చూశాను. దర్శకుడు మహి, రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. మమ్ముట్టి ఆయన పాత్రలో జీవించారు. నిర్మాతలు విజయ్ మరియు శశికి, వారి చిత్ర యూనిట్ కి నా కృతజ్ఞతలు” అని వ్యాఖ్యానించారు.