సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం దర్బార్. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. తెలుగులోనూ ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన మురుగుదాస్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా దర్బార్ కథ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు మురుగదాస్. ఈ సినిమా హైదరాబాద్లో సంచలనం సృష్టించిన దిశ ఘటన తరహ కథతో తెరకెక్కిందట. అయితే ఈ ఘటన కన్నా ముందే సినిమాను తెరకెక్కటం తరువాత అలాంటి ఘటన జరగటంతో చిత్రయూనిట్ కూడా షాక్కు గురయినట్టుగా తెలిపాడు మురుగదాస్. ఈ విషయంపై రజనీకాంత్ కూడా తనకు కాల్ చేసి మాట్లాడారని మురుగదాస్ తెలిపాడు. రజనీతో సినిమా చేసేందుకు చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పిన మురుగదాస్ దాదాపు 15 ఏళ్ల తరువాత ఆ కల నెరవేరిందన్నాడు. గజిని సినిమా సమయంలోనే రజనీని కలిసి సినిమా చేయాలన్న తన కోరిక చెప్పానని కానీ తరువాత ఇతర ప్రాజెక్ట్స్, రజనీ ఆరోగ్య సమస్య కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. సర్కార్ సినిమా సమయంలో కథ చెప్పమని రజనీ అడగటంతో దర్బార్ పాయింట్ చెప్పి ఓకే చేయించుకున్నట్టుగా తెలిపాడు. ఈ సినిమాలో హీరో పాత్రకు ఆదిత్య అరుణాచలం అనే పేరు పెట్టడం వెనుక ఉన్న ఇంట్రస్టింగ్ కథను చెప్పాడు మురుగదాస్. కథ, స్క్రీన్ప్లే రాసుకున్నప్పుడు అంతా హీరో అంటూ రాసుకున్న మురుగదాస్ సెట్స్ మీదకు వెళ్లే ముందు ఆ పాత్రకు పేరు ఏం పెట్టాలని ఆలోచన చేశాడట. ఆ సమయంలో తన కొడుకు ఆదిత్య పేరు, తండ్రి అరుణాచలం పేరును కలిపి ఆదిత్య అరుణాచలం అనే పేరును హీరో పాత్రకు ఫిక్స్ చేసినట్టుగా వెల్లడించాడు. ఇటీవల మహేష్ హీరోగా తెరకెక్కించిన బైలింగ్యువల్ మూవీ స్పైడర్ నిరాశపరచటంపై కూడా స్పందిచాడు మురుగదాస్. `మహేష్తో ఓ మంచి సినిమా చేయాలన్న ఆలోచనలోనే స్పైడర్ను తెరకెక్కించాను. కానీ తెలుగు, తమిళ ఆడియన్స్ను బ్యాలెన్స్ చేయటంలో ఫెయిల్ అయ్యా. కానీ ఈ సినిమా రిజల్ట్ తెలిసిన తరువాత మహేష్ నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ నన్ను నమ్మి సినిమా చేసిన సూపర్ స్టార్కు సక్సెస్ ఇవ్వలేకపోయానన్న గిల్ట్ మాత్రం నాకు అలా ఉండిపోయింది` అన్నాడు.
previous post
ఆ దర్శకుడి చెంప పగలగొట్టా… నటి కామెంట్స్