మరోసారి ధోనీ రిటైర్మెంట్ పై వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. 2020 ఐపీఎల్ తర్వాత ఎంఎస్ ధోనీ తన భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటాడని సమాచారం. కెరీర్పై వస్తున్న ఊహాగానాలకు తెరదించాలనే ఉద్దేశంతోనే మహీ ఉన్నాడని అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రపంచకప్లో న్యూజిలాండ్తో ఓటమి తర్వాత అతడు జట్టుకు స్వతహాగా దూరమయ్యారు. రెండు నెలలు సైన్యంలో పనిచేస్తానని చెప్పాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి విహారానికి వెళ్లడంతో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్కూ అందుబాటులో లేడు. వెస్టిండీస్ సిరీస్కూ ఎంపికవ్వలేదు. ధోనీ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటే అది కచ్చితంగా ఐపీఎల్ తర్వాతే. అతడో గొప్ప ఆటగాడు. అతడిపై ఊహాగానాలను అడ్డుకోలేం. ప్రస్తుతం ఫిట్నెస్ పరంగా దృఢంగా ఉన్నాడు. నెల రోజుల నుంచి కఠినంగా సాధన చేస్తున్నాడు. ఐపీఎల్ కన్నా ముందు ఎన్ని అంతర్జాతీయ మ్యాచులు ఆడతాన్నది మాత్రం తెలియాల్సి ఉందని ఆ సన్నిహితుడు తెలిపారు.
ఇప్పటి వరకు మహీ రిటైర్మెంట్పై వచ్చిన వదంతులను అతడి సతీమణి సాక్షి, చెన్నై సూపర్ కింగ్స్ ఖండిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తన ఉద్దేశమేంటో ఇప్పటి వరకు మహీ వెల్లడించలేదు. అతడిని దాటేసి ముందుకెళ్తున్నామని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ గతంలో అన్నారు. రిషభ్ పంత్కు అవకాశాలు ఇస్తున్నారు. ‘విజేతలు అంత త్వరగా ముగించరు కదా’ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్న సంగతి తెలిసిందే. టీమిండియా తరఫున ధోనీ 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. మొత్తంగా 17,000 పైచిలుకు పరుగులు చేశాడు. వికెట్ కీపర్గా పరిమిత ఓవర్ల క్రికెట్లో 500, టెస్టుల్లో 300 ఔట్లు చేశాడు.