టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు భద్రత తగ్గించామనడం సరికాదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. చంద్రబాబుకు భద్రత ను తగ్గించారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. నిబంధనల ప్రకారం చంద్రబాబుకు ఎంత భద్రత ఇవ్వాలో అంతకంటే ఎక్కువగానే సెక్యూరిటీ కల్పించామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ శాంతిభద్రత విషయంలో పోలీసులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారని డీజీపీ అన్నారు.
ప్రత్యేకహోదా సమయంలో ఉద్యమించిన ప్రజలపై కేసుల మాఫీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన “స్పందన” కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తామన్నారు. జిల్లా ఎస్పీ, సీపీ కార్యాలయాల్లో గ్రీవెన్ సెల్స్ ఏర్పాటు చేశామని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.