అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. గొల్లపూడిలో చేపట్టిన 24 గంటల దీక్షను బుధవారం మధ్యాహ్నం పలువురు రైతులు నిమ్మరసం ఇచ్చి దేవినేని ఉమా దీక్షను విరమింపజేశారు. రాజధాని పై ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతు తెలుపుతూ దేవినేని ఈ దీక్షకు పూనుకున్నారు.
ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. రైతుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. రాజధానికోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని పేర్కొన్నారు. తమ భూములను త్యాగం చేసిన రైతులనుద్దేశించి మంత్రులు హీనంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని దేవినేని డిమాండ్ చేశారు.