రాష్ట్ర రాజధానిని మార్చే అధికారాన్ని సీఎం జగన్ కు ఎవరిచ్చారని టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకుండా విశాఖలో కలెక్టర్, కమిషనర్ పక్కన కూర్చొని రాజధానిని ప్రకటించే అధికారాన్ని విజయసాయిరెడ్డికి ఎవరిచ్చారని అడిగారు.
తప్పుడు పనులు చేసి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి తనను తిడుతున్నాడని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై దేవినేని మండిపడ్డారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లో కీలక వ్యక్తి ఆయన అల్లుడి స్నేహితుడని చెప్పారు. ఆయనతో సన్నిహిత సంబంధాలను పెట్టుకుని రాజధానిపై నివేదిక ఇచ్చే పనిని వారికి అప్పగించారని ఆరోపించారు. విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.