పోలవరం ప్రాజెక్టు భద్రతను వాళ్ల సౌలభ్యం కోసం తాకట్టు పెట్టారని సీఎం జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పనులపై విజయవాడలో దేవినేని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం పనులను తమ వాళ్లకు కట్టబెట్టేందుకే రివర్స్ టెండరింగ్ నిర్వహించారని ఆరోపించారు.
ప్రాజెక్టు స్పిల్ వే సహా బ్యాలన్స్ పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తామని డ్యామ్ సైట్లో పనిచేస్తున్న కంపెనీ ముందుకొస్తే, ‘ఫర్ కన్వీనియెన్స్’ అంటూ ఆ సంస్థను పక్కనబెట్టారని ఆరోపించారు. వందల కోట్లు ఆదా చేశామంటూ డబ్బాలు కొట్టుకోవడం మొదలుపెట్టారని దుయ్యబట్టారు. నవయుగ సంస్థ అదే ఎస్ఎస్ఆర్ రేట్లతో పనులు చేపట్టిందని వివరించారు.
తమపై బురద జల్లాలని సీఎం జగన్ మైనస్ 12 శాతం ఎస్ఎస్ఆర్ రేట్లు అదనంగా వేయించారని, తత్ఫలితంగా పనుల రేటు మైనస్ 26 శాతానికి చేరిందని దేవినేని ఉమ వివరించారు.రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టులో 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని, 194 టీఎంసీల నీరు నిలబెట్టాలని, అటువంటి డ్యామ్ లో ఇవాళ స్వార్థపూరిత రాజకీయాలతో కాంట్రాక్టర్లను, ఏజెన్సీలను లొంగదీసుకుందని ఏపీ సర్కారుపై మండిపడ్డారు.
తన జీవితం ప్రజలకే అంకితం: కవిత