ఇసుక పాలసీపై టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దర్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ ధర్నాలో భాగంగా కృష్ణా జిల్లా గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే కార్యక్రమానికి వెళ్తున్న టీడీపీ నాయకుడు దేవినేని ఉమను పోలీసులు అడ్డుకుని గృహనిర్బంధం చేశారు.
ధర్నాకు ఎటువంటి అనుమతి లేదంటూ పోలీసులు ఆయనకు నోటీసు జారీ చేశారు. దీనిపై ఉమ మండిపడుతూ శాంతియుతంగా ధర్నా చేసే వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది టీడీపీ నాయకులను అరెస్టు చేశారని మండిపడ్డారు. పోలీసు బలంతో ఏపీలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అందరికీ అందుబాటులో ఉండేలా ఇసుక పాలసీని తీసుకురావాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు.