16వ లోకసభ చివరి సమావేశాల్లో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత రాజీనామా చేసేందుకు తాను ముందుకు వచ్చానని, కానీ ఎంపీగా కొనసాగాలని తనను ప్రధాని మోడీ కోరారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తుంటామని, అలాగే 2014 లోకసభ ఎన్నికల సందర్భంగా నేను మోడీకి ఓ సవాల్ విసిరానని, ఈ ఎన్నికల్లో బీజేపీ 276 సీట్ల కంటే ఎక్కువ గెలిస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పాను.
అప్పటి ఎన్నికలలో బీజేపీ 282 సీట్లు సాధించింది. సవాల్ ప్రకారం, నేను విసిరిన సవాల్ ప్రకారం ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు మోడీ వద్దకు వెళ్లానని, అప్పుడు మోడీ తనను రాజీనామా చేయవద్దని చెప్పారని గుర్తు చేసుకున్నారు. దానిని అంత సీరియస్గా తీసుకోవద్దని, మీకు రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉందని, మీలాంటి వాళ్లు రాజీనామా చేయకూడదని తనతో చెప్పారని అన్నారు. ఈ అయిదేళ్లలో నేను మోడీని మూడు, నాలుగు సార్లు కలిశానని, తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా విభేదాలు లేవని చెప్పారు.