ఉగాది రోజున 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సింహాచలం వరాహలక్ష్మీనరసింహస్వామిని నిన్న దర్శించుకున్న మంత్రి అనంతరం మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో తమ ప్రభుత్వం రికార్డు సృష్టించబోతోందని తెలిపారు.
అలాగే, ఏపీ రాజధాని అమరావతి పై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఏపీకి రాజధాని కాదని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతోనే విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. 20 గ్రామాల వారు తప్ప మరెవరూ ఆందోళన చేయడం లేదన్నారు.