దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వే నిర్మాణాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇందువల్ల ఢిల్లీలోకి అడుగుపెడుతున్న ట్రక్కుల సంఖ్య తగ్గిందన్నారు.
ట్రక్కుల సంఖ్య తగ్గడంతో కాలుష్య స్థాయి తగ్గుముఖం పడుతోందని అన్నారు. కాలుష్యంతో పోరాటంలో సహకరిస్తున్న ఢిల్లీ ప్రజలకు కూడా ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాలుష్యం తగ్గుముఖం పట్టడానికి ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ఒక కారణమని ఆయన వివారించారు. కాలుష్యం స్థాయి తగ్గడానికి కేవలం ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నాలు ఒక్కటే కారణం కాదన్నారు. మా ప్రయత్నాలకు సహకరిస్తున్న అన్ని ఏజెన్సీలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.