రాజధాని అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. అందులో భాగంగా ఢిల్లీ ప్రజలకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. 200 యూనిట్ల విద్యుత్ను లోపు ఉచితంగా అందిస్తామని, అది గురువారం నుండే అమలులోకి వస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. 201 నుండి 400 యూనిట్ల వరకు వినియోగించేవారికి సగం ధరకు విద్యుత్ను అందిస్తామని, ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందిస్తుందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా అతి చౌకగా విద్యుత్ లభించేది ఢిల్లీలోనే. ఇది చారిత్రాత్మక విజయం. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి ఉపయోగపడుతుంది.
ఉచిత విద్యుత్ పథకం(ఫ్రీ లైఫ్ లైన్ ఎలక్ట్రిసిటీ స్కీం) కింద ప్రతి నెలా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారికి ఎటువంటి బిల్లు రాదు. విఐపి, పెద్ద పెద్ద రాజకీయ నేతలు ఉచితంగా విద్యుత్ను పొందుతుంటే ఎవరూ మాట్లాడరు. సగటు మనిషి పరిస్థితేంటి? నేను తీసుకున్న నిర్ణయం తప్పా?’ అని ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో ఢిల్లీ వ్యాప్తంగా 33 శాతం మంది లబ్ధి పొందనున్నారు. వీరంతా వేసవిలో కూడా 200 యూనిట్ల లోపే విద్యుత్ను వినియోగించారని సమాచారం. చలికాలంలో అయితే 70 శాతం మందికి పైగా 200 యూనిట్ల విద్యుత్ కూడా వినియోగించడం లేదని తెలిపారు. మంచి విద్య, ఆరోగ్యం మాదిరిగానే ఇంట్లో లైట్లు, ఫ్యానులు తిరగడానికి కనీస విద్యుత్ కూడా అవసరమే అని ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. కాగా ఇది ఎన్నికల జిమ్మిక్కని బిజెపి ఆరోపించింది.