ఏపీకి ప్రత్యక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంఘీభావం తెలిపారు. సోమవారం దీక్షా స్థలికి చేరుకున్న రాహుల్ ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబును కలిసి దీక్షకు మద్దుతు తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ఈరోజు రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేయనున్నారు. దీక్షకు పలు జాతీయ పార్టీలు మద్దతు తెలుపనున్నాయి.