భారతీయ వంటకాలలో పప్పుదినుసుల ప్రాముఖ్యతే వేరు. రోజు ఏదో ఒక పప్పు దినుసు ఆహారంలో ఉండాల్సిందే. అయితే దానిని ప్రాంతాల వారీగా ఆయా వంటకాలలో వాడుతుండటం విశేషం. దక్షిణ భారతంలో అయితే పప్పు, సాంబార్.. వంటివి లేకుండా రోజే గడవదు. కానీ, నేడు పాశ్చాత్య ఆహారానికి అలవాటు పడిన పిల్లలు, పప్పా మాకు వద్దు .. అనేస్తారు. కానీ దానిలో అంత నెయ్యి పోసుకొని, కాస్తంత ఆవకాయ వేసుకుతింటే.. అబ్బా.. ఆ రుచి ఇంకెక్కడా ఉండదు; అదే నిజమైన ఆహారం, తెలుగు వారికి తృప్తినిచ్చేది. ఇలా పెద్దల నుండి వచ్చిన ఈ పప్పు దినుసులు ఇటీవల ఆహారంలో కనుమరుగవుతున్నాయి. వాటిని మళ్ళీ ఆహారంలో చేర్చుకొని తీరాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా శాఖాహారులు ఈ పప్పే మటన్ తో సమానమైన శక్తిని ఇస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అయితే ఈ పప్పు దినుసుల ప్రాధాన్యతలలో కొన్నిటిని తెలుసుకోడానికి ప్రయత్నిద్దాం..
1. పప్పు దినుసులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలలో తెలింది.
2. పప్పు దినుసులలో అధికంగా ఉండే ఫొలేట్, మెగ్నిషియం పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
3. డయాబెటిస్ ఉన్నవారు నిత్యం పప్పు దినుసులను తీసుకుంటే షుగర్ లెవల్స్ను కంట్రోల్ చేసుకోవచ్చు.
4. పప్పు దినుసులలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శరీరానికి మంచి శక్తి లభిస్తుంది.
5. పప్పు దినుసులను తినడం వల్ల మలబద్దకం, డయేరియా వంటి సమస్యలు తగ్గుతాయి.
6. నిత్యం పప్పు దినుసులను తీసుకునే వారి బరువు నియంత్రణలో ఉంటుంది. శరీర రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది.