telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

విద్యుత్తు బిల్లులతో వినియోగదారులకు షాక్!

లాక్ డౌన్ కారణంగా రెండు నెలల పాటు కరెంట్ బిల్లుల రీడింగ్ నమోదు చేయని తెలంగాణ విద్యుత్తు శాఖ సిబ్బంది ఇప్పుడు ఇంటింటికీ తిరిగి రీడింగ్ తీస్తుండగా బిల్లులను చూసిన వినియోగదారులు షాక్ నకు గురవుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు గత సంవత్సరం అదే నెలలో నమోదైన బిల్లును చెల్లించాలని టీఎస్ఎస్పీడీసీఎల్ కోరగా, లక్షలాది మంది బిల్లులు చెల్లించారు.

ఇక మార్చి తొలి వారంలో బిల్స్ తీసిన తరువాత, జూన్ నెల ఆరంభం వరకూ మీటర్ రీడింగ్ లను తీయని విద్యుత్ శాఖ, ఇప్పుడు వచ్చి రీడింగ్ ను చూసి బిల్లులను జారీ చేస్తోంది. మూడు నెలల కరెంట్ బిల్లుకు సంబంధించిన మొత్తాన్ని ఒకే బిల్లులో ఇస్తోంది. దీంతో యూనిట్లు పెరిగిపోయి, స్లాబ్ లు మారిపోయి, అన్యాయమైన భారం వినియోగదారులపై పడుతోంది.

ఒకే ఇన్ వాయిస్ లో మూడు నెలల బిల్లును జారీ చేయడం సరికాదు. చాలా మంది శ్లాబ్ లు మారిపోతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ఈ విషయంలో విద్యుత్ అధికారుల వాదన మాత్రం వేరేలా ఉంది. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉన్నారని, ఎంతో మంది ఇంటి నుంచి పని చేశారని అంటున్నారు. ఈ కారణంతోనే విద్యుత్ వినియోగం పెరిగి శ్లాబ్ లు మారాయని చెప్పడం గమనార్హం.

Related posts