పుల్వామా ఉగ్రదాడిలో 43మంది సీఆర్పీఎఫ్ జవానుల మృతిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెళ్లువిరుస్తున్న నేపథ్యంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అమర జవాను భార్యను టార్గెట్ చేసిన ఓ దుర్మార్గుడు ప్రభుత్వం ఆమెకిచ్చిన పరిహార సొమ్మును కాజేశాడు. మధ్య ప్రదేశ్లోని సెహోర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం 2013 శ్రీనగర్లో జరిగిన టెర్రరిస్టుల దాడిలో మధ్యప్రదేశ్కు సీఆర్పీఎఫ్ జవాను ఓం ప్రకాశ్ మారదానియా అసువులు బాసారు. అయితే ఆయన భార్య కమల్ బాయికి ప్రభుత్వం రూ.8లక్షలను ఇచ్చింది. ఈ విషయాన్ని గమనించిన మిశ్రీలాల్ మీనా అనే వ్యక్తి కమలా బాయిని ఈ నెల 11న కలిశాడు.
కల్లిబొల్లి మాటలతో తను సీఆర్పీఎఫ్కి చెందిన వ్యక్తినని నమ్మించాడు. అమర జవానుల కుటుంబ సంక్షేమ సమాచారం నిమిత్తం ప్రభుత్వం తనను పంపించిందని చెప్పాడు. అలాగే ప్రభుత్వం మరో 34లక్షల రూపాయలను మంజూరు చేసిందని, ఇందుకు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన 8లక్షల రూపాయలను బ్యాంకునుంచి విత్డ్రా చేయాలని ఆమెను నమ్మించాడు. అతని మాటల్ని విశ్వసించిన కమలా బాయి ఆ డబ్బులను విత్ డ్రా చేసి వాడికి ఇచ్చింది. అంతే ఇదే అదనుగా భావించిన అతగాడు అక్కడ్నుంచి పారిపోయాడు. మరోవైపు కమలా బాయి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.