భారత క్రికెటర్ మనోజ్ తివారీ అధికార తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. అయితే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న వేళ హుగ్లీలో జరిగిన ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీ కండువా కప్పుకొన్నారు. ఈ ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో తృణమూల్, బీజేపీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ఛోటా దాదాగా పేరు గడించిన మనోజ్ తివారీ టీఎంసీలో జాయిన్ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హుగ్లీలోని చిన్సురాలో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తివారీ టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రంలో బీజేపీ పాలనపై గత కొంతకాలంగా మనోజ్ తివారీ సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన తివారి.. వెస్ట్ బెంగాల్ స్టేట్ టీమ్కు కెప్టెన్గా కూడా వ్యవహరించారు. భారత్ తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. అయితే క్రికెట్ లో పేరు సంపాదించుకున్న మనోజ్ తివారీ రాజకీయాల్లో ఏం చేస్తారో చూడాలి.
previous post