సీపీఐ తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుండి తన భావాలకు దగ్గరగా ఉన్నదనుకొని పొత్తు పెట్టుకున్నారు. రానున్న ఎన్నికలలో దానిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అయితే అన్ని పొత్తులలో మాదిరిగా సీట్ల విషయంలో ఏమైనా అసంతృప్తి నెలకొండేమో కానీ, తాజాగా సీపీఐ పవన్ పార్టీకి తమ మద్దతు ఉపసంహరించుకునేందుకు సిద్ధం అవుతుంది. పవన్ పొత్తు ధర్మాన్ని పూర్తిగా విస్మరించారని సీపీఐ ఆరోపిస్తుంది. అందుకే రానున్న ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగే ఆలోచనలో ఉంది.
జనసేనతో తెగదెంపులు చేసుకోనున్నట్టు నేడు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియా ముందు వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంగా తమకు ఇచ్చిన సీట్లలో జనసేన అభ్యర్థులను పెడుతున్నట్టు పవన్ ప్రకటించడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిన్న సాయంత్రం నుంచి పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్న రామకృష్ణ, ఈ ఉదయం వాటిని కొనసాగించారు. జనసేనతో విడిపోయి, సొంతంగా పోటీ చేసి సత్తా చాటాలని పలువురు సీనియర్ నేతలు సూచించినట్టు తెలుస్తోంది.
నూజివీడు, విజయవాడ స్థానాలను సీపీఐకి ఇచ్చినట్టు తొలుత చెప్పిన పవన్ కల్యాణ్, ఆపై వాటిల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించి, వారికి బీ-ఫామ్ లను అందించిన సంగతి తెలిసిందే. తమతో ఏ మాత్రం చర్చించకుండానే పవన్ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నారన్నది సీపీఐ నేతల ప్రధాన ఆరోపణ. స్వతంత్రంగా పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించుకుంటే, నామినేషన్లు దాఖలు చేయడానికి రేపు ఒక్కరోజు మాత్రమే సమయం మిగులుతుంది.
ఈ పొత్తు ల మధ్య చిచ్చుకు కారణం, ఏపీలో అధికార పార్టీకి, జనసేనకు తెరవెనుక కుదిరిన ఒప్పందం కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటివరకు టీడీపీకి మద్దతు ఇవ్వబోమని బహిరంగంగా తేల్చి చెపుతున్నా, తాజాగా మధ్యవర్తిత్వం విజయవంతం కావటంతో మరోసారి జనసేన టీడీపీతో జతకట్టేందుకు సిద్ధం అవటం.. ఇది నచ్చక కారణాలు ఏదో ఒకటి చూపి సీపీఐ జనసేనకు దూరం కావటం జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.