టీఎస్ఆర్టీసీకి చెందిన ఓ బస్సు హైదరాబాద్ ఇమ్లీబన్ లో మంగళవారం రాత్రి చోరీకి గురైన విషయం తెలిసిందే. అఫ్జల్గంజ్ పరిధిలో కుషాయిగూడ ఆర్టీసీ బస్సు చోరీకి గురైందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా బస్సు చోరీ నిందితులను గుర్తించామని వివరించారు. ఈ సందర్భంగా కేసు వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో వివరించారు. అఫ్జల్గంజ్ నుంచి బస్సు ఎత్తుకెళ్లిన నిందితులు ఇద్దరిని గుర్తించామని తెలిపారు.
ఈ కేసులో ఇద్దరు నిందితులు అన్నదమ్ములు. దుబాయ్లో భారీ వాహనాలు నడిపిన అనుభవం వీరికి ఉందిని తెలిపారు. జల్సాలకు అలవాటు పడి నిందితులు చోరీలకు పాల్పడుతున్నారు. అఫ్జల్గంజ్ పరిధిలో వీరు ఆటోలు నడిపేవారు. దొంగలించిన బస్సును నాందేడ్కు 10 కిలోమీటర్ల దూరంలోని షెడ్డుకు చేర్చారు. నిందితులు బస్సును 37 ముక్కలుగా చేశారు. బస్సుకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. బస్సు చోరీ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.