ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఇటలీలో కరోనా కమ్ముకోవడంతో ఇప్పటివరకు ఆ దేశంలో 12,462 మందికి వైరస్ సోకగా 827 మంది మరణించారు. ఇందులో బుధవారం ఒక్క రోజే 196 మంది చనిపోవడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. మృతుల సంఖ్య ఒక్క రోజులోనే 30 శాతం పెరగడం, ఒక్క రోజులోనే అదనంగా 2,200 మందికి వైరస్ సోకడంతో ఇటలీలో అత్యవసర పరిస్థితిని విధించారు.
కరోనా ప్రమాదకరంగా విజృంభిస్తుండటంతో ఇటలీలో మొత్తంగా క్వారంటైన్ ప్రకటించారు. దీనిపై ఆ దేశ ప్రధాన మంత్రి గ్యుసెప్పి కాంటే ప్రజలకు సందేశం ఇచ్చారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతోపాటు బ్యూటీ సెలూన్ల వంటివి కూడా రెండు వారాల పాటు మూసేయాలని ఆదేశించారు. అత్యవసర సర్వీసులు, సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులు వంటివి మాత్రమే తెరిచి ఉంచాలని సూచించారు.