దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. వైద్య సిబ్బందికి కరోనా సోకడంతో 24 గంటల్లో రెండు హాస్పిటళ్లను అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదైన ప్రాంతాల్లో ఒకటైన జహంగిర్పురిలో ఉన్న బాబు జగ్జీవన్రామ్ మెమోరియల్ హాస్పిటల్ను (బీజేఎంహెచ్) అధికారులు ఆదివారం సీజ్ చేశారు. ఆ దవాఖానలో పనిచేస్తున్న 44 మంది వైద్యులు, సిబ్బంది కరోనా పాజిటివ్ అని తేలింది.
దీంతో ఆ ఆస్పత్రిని అధికారులు మూసివేశారు. శనివారం సాయంత్రం ఓ నర్స్ కరోనా వైరస్ బారిన పడటంతో ఆమె పనిచేస్తున్న హిందూ రావ్ హాస్పిటల్ను అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీలో ఇప్పటివరకు 2,625 కరోన కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 111 కేసులను గుర్తించారు. ఇప్పటివరకు వైరస్ బారిన పడి 54 మంది మరణించారు.