పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేతకు సంబంధించి ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “మల్లేశం”. ఈ సినిమాలో ప్రియదర్శి, అనన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ని బుధవారం విడుదల చేశారు. పూర్తిస్థాయిలో తెలంగాణ మాండలికంలో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో మల్లేశం తల్లి పాత్రలో ఝాన్సీ నటించింది. ఈ చీరకు అసు పని చేసేందుకు తన తల్లి పడుతున్న శ్రమని చూసిన మల్లేశం.. ఆ శ్రమ నుంచి తప్పించుకొనేందుకు ఆసు యంత్రాన్ని కనిపెడతాడు. ఈ అంశాన్నే ప్రధాన కథనంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చేనేత రంగంలో మల్లేశం చేసిన కృషికి భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించడమే కాకుండా చేనేత పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చేనేత యూనిట్ డెవలప్మెంట్ కోసం మల్లేశంకు కోటి రూపాయలను ప్రకటించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన చింతకింది మల్లేశం బయోపిక్ “మల్లేశం” పేరుతో ఈ నెల 21న విడుదల కానుంది.
మరో రెండ్రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలోనే ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. చింతకింది మల్లేశం కంటే ముందుగానే తామే ఆసు యంత్రాన్ని కనుగొన్నట్లు ఎలుగొందుల సత్యనారాయణ, ఆయన తమ్ముడు ఎలుగొందుల శ్రీనివాస్ పేర్కొంటున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఆసుయంత్రాన్ని తామే రూపొందించామని, అయితే తాము దాన్ని మార్కెట్ చేసుకోలేదని, తాము రూపొందించిన యంత్రాన్నే మల్లేశం రూపొందించారని వారు అంటున్నారు. ఇందులో నిజా నిజాలు సంగతి ఏమో కానీ.. సినిమా విడుదల సమయంలో ఈ కాంట్రవర్సీ రావడం గమనార్హం.