తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ఆరోపించారు. కనీసం మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయకుండా ఫామ్హౌజ్లో యాగాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ.. కుట్రలు, కుతంత్రాలు చేసి, కోట్ల రూపాయలు ధారపోసి గెలిచిందని ఆమె ఆరోపించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని ఆ పార్టీ కో–చైర్మన్ డీకే అరుణ, విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.
ప్రచార కమిటీ సభ్యులుతో కలిసి సోమవారం డీకే అరుణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్లో ఇంకా టీడీపీపై కోపం ఉందన్న విషయాన్ని అసెంబ్లీ ఫలితాలు వెల్లడించాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. రాహుల్, మోదీ మధ్య జరిగే యుద్ధంలో న్యాయం గెలుస్తుందని అన్నారు. తనకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీకి విజయశాంతి కృతజ్ఞతలు తెలిపారు.