ఆర్టికల్ 370 రద్దును కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతించడాన్ని ఆ పార్టీ మహిళా నేత విజయశాంతి సమర్థించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. జ్యోతిరాదిత్య సింధియా, జనార్దన ద్వివేది తదితరులు బీజేపీ నిర్ణయాన్ని సమర్ధించడాన్ని ప్రస్తావించిన ఆమె, దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ ఎన్నడూ రాజీ పడబోదని అన్నారు.
కశ్మీర్ విభజన బిల్లుతో పాటు ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు రాహూల్ గాంధీ కుడిభుజం, కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించడం, కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించడం శుభపరిణామం. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ- నెహ్రూ కుటుంబానికి సన్నిహితుడైన జనార్దన ద్వివేది కూడా కేంద్రం జమ్ము, కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు. ఇప్పుడు దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని జ్యోతిరాదిత్య సింధియా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా…దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదన్నది కాంగ్రెస్ సిద్ధాంతం. కాంగ్రెస్ లోని మెజారిటీ కార్యకర్తలు జమ్ము- కశ్మీర్ విభజనతో పాటూ ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు చెందిన చాలా మంది నేతలు కశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించవచ్చు. కశ్మీర్ విభజనతో సుదీర్ఘ కాలంగా రగులుతున్న సమస్యకు పరిష్కారం లభించాలని కోరుకుంటూ…వందే మాతరం…జైహింద్” అని ఆమె ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.