తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం ప్రగతి భవన్లో ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లతో సమావేశమైనట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఏప్రిల్-3న మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సమక్షంలో సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి పోటీ చేసిన ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్రెడ్డి చేతిలో ఓడిపోయారు. పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయాలని సునీతా భావించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు టికెట్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.