ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం ఒక్కటయ్యారు కాబట్టే తన మీద ఈడీ కేసు పెట్టారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రూ. 150 కోట్లు సీజ్ చేశారని, అందరి మీదా ఈడీ కేసు పెట్టారా అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. పట్నం నరేందర్ రెడ్డి దగ్గర రూ. 50 లక్షలు దొరికాయని, మరి ఆయనపై ఈడీ కేసు ఎందుకు పెట్టలేదని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. తన మీద చార్జ్షీట్ వేసిన తర్వాత మళ్ళీ ఈడీకి ఎందుకు అప్పగించారని, కేవలం రాజకీయంగా వేధించడానికే ఈడీ కేసును వాడుకుంటున్నారని రేవంత్రెడ్డి ఆరోపించారు.
పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని రేవంత్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అసలు సైనికులంటే గౌరవముందా? అని ప్రశ్నించారు. ఉగ్రవాదుల దాడిలో 45మంది సైనికులు వీరమరణం పొందడంతో యావత్ దేశం దు:ఖంతో నివాళులర్పిస్తే సీఎం ఒక్కసారైనా అమర జవాన్ల త్యాగాల గురించి గుర్తుచేసుకున్నారా అని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి చనిపోతే కేసీఆర్ రెండు సార్లు ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారు. కానీ దేశం కోసం చనిపోయిన జవాన్లకు నివాళులర్పించే సమయం మాత్రం ఆయనకు లేదని రేవంత్ విమర్శించారు.