ఆటోమొబైల్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలు పోతున్న దుస్థితిపై ఆమె శుక్రవారం ట్విటర్ లో స్పందించారు.ఉద్యోగాలు పోతున్న దుస్థితిపై బీజేపీ ప్రభుత్వం మౌనంగా ఉండటం చాలా ప్రమాదకరమని ప్రియాంక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు మీడియా రిపోర్ట్ను కూడా జత చేశారు.
ఆటో విడి భాగాల పరిశ్రమ ఒడుదొడుకుల్లో ఉందని లక్షల్లో ద్యోగాలు పోయే ప్రమాదం ఉందని ఆటోమోటివ్ కాంపొనెంట్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో ప్రియాంక ఇచ్చిన ట్వీట్లో ఆటోమొబైల్ రంగంలో పని చేస్తున్న 10 లక్షల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. ఈ రంగంలో పని చేస్తున్నవారు కొత్త ఉద్యోగాల కోసం అన్వేషించవలసి ఉంటుందన్నారు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధానాలపై బీజేపీ ప్రభుత్వ మౌనం చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు.