ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశం పై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు భవిష్యత్తులో మళ్లీ ఒకటవుతాయని ఆయన వాదిస్తున్నారు. దశాబ్దాల పోరాటం తరువాత విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విలీనమై ఒకే రాష్ట్రంగా ఏర్పడే రోజు వస్తుందని జయరాం రమేష్ ఆకాంక్షించారు.తన జీవిత కాలంలో మళ్లీ సమైక్యాంధ్రప్రదేశ్ను చూస్తానని అంటున్నారు. విభజన చట్టాన్ని రూపొందించిన జయరాం రమేష్ సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోవటం పట్ల ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు జర్మనీలు చాలా ఏళ్లపాటు విడివిడిగా ఉన్నా చివరకు ఏకమయ్యాయని ఆయన తెలిపారు. ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు సమీప భవిష్యత్తులో ఒక దేశంగా అవతరించే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదే విధంగా ఆరేళ్ల క్రితం రెండుగా చీలిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒక్కటవుతాయని, సమైక్య ఆంధ్రప్రదేశ్ డిమాండ్ మరోసారి తెరపైకి వస్తుందని ఆయన వాదిస్తున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం సమైక్యాంధ్రప్రదేశ్ ఏర్పడదని, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే సమైక్యాంధ్రప్రదేశ్ కల సాకారం కావచ్చునని జయరాం రమేష్ భావిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ను విడదీసి కాంగ్రెస్ తప్పు చేసిందనే భావనను ఆయన వ్యక్తం చేశారు.