లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆత్రం సక్కు, రేగ కాంతారావు, లింగయ్య, హరిప్రియ, ఉపేందర్రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఖమ్మం జిల్లా నుంచి మరో నేత హస్తం పార్టీని వీడి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శుక్రవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు.
జిల్లాలో రాజకీయాలు, పార్టీ పరిస్థితిపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లోకి చేరేందుకు వనమా ఆసక్తి చూపగా కేటీఆర్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
దీంతో త్వరలోనే వనమా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు ఇకపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో సాటు, కోడెం వీరయ్య మాత్రమే మిగలనున్నారు. కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదాను గల్లంతు చేయడంతో పాటు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆ పార్టీని దెబ్బతీయాలని టీఆర్ఎస్ వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 19 కాగా వారిలో 14 మంది ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరితే విలీనం జరిగే అవకాశం ఉంది.