కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ యువ నేత జ్యోతిరాదిత్య సింధియా స్వాగతించడం శుభపరిణామమని అన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ- నెహ్రూ కుటుంబం సన్నిహితుడు జనార్ధన ద్వివేది కూడా సమర్థించారని ఆమె తెలిపారు. దేశ భద్రత దృష్ట్యా జ్యోతిరాదిత్య సింధియా కూడా సమర్థించినట్లు విజయశాంతి చెప్పారు. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదన్నది కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు. జమ్మూకశ్మీర్ విభజనను మెజారిటీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా స్వాగతిస్తున్నారని ఆమె తెలిపారు.
వీలైనంత త్వరలో చాలా మంది కాంగ్రెస్ నేతలు కశ్మీర్ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్ధించవచ్చని విజయశాంతి చెప్పారు. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలోనూ, శత్రు దేశ కుట్రలను తిప్పి కొట్టడంలోనూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తమ గళాన్ని వినిపిస్తారనే విషయాన్ని సింధియా, ద్వివేది ప్రకటనల ద్వారా మరోసారి రుజువైందని ఆమె తెలిపారు. కశ్మీర్ విభజనతో సుదీర్ఘ కాలంగా రగులుతున్న సమస్యకు పరిష్కారం లభించాలని, అక్కడి ప్రజలు సుఖ, శాంతులతో జీవనం సాగించాలని తాను కోరుకుంటున్నట్లు విజయశాంతి చెప్పారు.