కాంగ్రెస్ విద్యార్థి నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో నాడు ఉద్యమాల స్వేచ్ఛ ఉండేదని, ఇప్పుడు అది మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. తమ పార్టీ నేతల మీద దండయాత్ర చేస్తున్న పోలీసులు.. రేపటినాడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం సమాధానం చెబుతారని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులు సహకరించడం వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులకు తెలంగాణ ముఖ్యమంత్రికి తేడా ఏంటో ప్రజలు చూస్తున్నారని అన్నారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఈ విషయాన్ని అధికార పార్టీ గుర్తించాలని వ్యాఖ్యానించారు.