తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రులు రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. సచివాలయాన్ని కట్టించుకునే పనిలో వారు నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. సచివాలయం దర్వాజలు, కిటికీలపై సీఎం రివ్యూలు పెట్టడం బాధాకరం అన్నారు. సీఎం వైఖరిని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే రాష్ట్రంలో ఇంత హీనమైన పరిస్థితి ఉండేది కాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఈటల రాజేందర్ పైనా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. మంత్రి ఈటల రాజేందర్ ఒక బొమ్మ అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కీ ఇచ్చినప్పుడే ఈటల మాట్లాడుతారని విమర్శించారు. కరోనా విషయంలో ఏదైనా జరగరానిది జరిగితే ఆ నిందను ఈటెల మీద వేస్తారని జగ్గారెడ్డి అన్నారు.