తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దాడులపై సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశం అనంతరం భట్టి మీడియాతో మట్లాడుతూ దిశ దుర్ఘటన అందరినీ దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. గత రెండు సంవత్సరాలలో రాజధాని హైదరాబాద్ లో 4 వేల మంది అమ్మాయిలు కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దీనినిబట్టి అర్ధం చేసుకోవచ్చు అన్నారు.
రాష్ట్రంలో వరుసగా మహిళలపై జరుగుతున్న దాడులు ప్రజలను భయానికి గురి చేస్తున్నాయన్నారు. మహిళలపై దాడి నిందితులకు ఉరి శిక్షే సరైనదని అన్నారు. మద్యం అమ్మకాలే వీటికి ప్రధాన కారణమని, విచ్చల విడి అమ్మకాలతో పాటు బెల్టు షాపుల నిర్వహణ కూడా నేరాల పెరుగుదలకు ఊతం ఇస్తున్నాయి అన్నారు. ప్రభుత్వం కూడా కేవలం ఆదాయ కోణంలోనే మద్యం అమ్మకాలను చూస్తోందని ఆరోపించారు.