అఫిడవిట్ సమర్పిస్తేనే బీ-ఫాం అందించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకొంది.అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను డీసీసీలకు అప్పగించింది. రాష్ట్రంలోని 32 డీసీసీ అధ్యక్షులతో టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్లో సమావేశమయ్యారు. ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులకు ఉత్తమ్ బీ-ఫాంలను అందించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బీ-ఫారం తీసుకొనే సమయంలో రూ. 20 స్టాంపు పేపర్పై అఫిడవిట్ను తీసుకోవాలని ఉత్తమ్ సూచించారు.పార్టీ ఫిరాయింపులకు పాల్పడబోమని, పార్టీ విప్, ఆదేశాలను ధిక్కరించబోమని పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లను కేటాయించాలని ఉత్తమ్ వివరించారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణలతో పాటు గెలుపు అవకాశాలను కూడ పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తమ్ సూచించారు.