మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన “చిత్రలహరి” ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ తో సాయిధరమ్ తేజ్ చేస్తున్న తర్వాత చిత్రం “ప్రతిరోజు పండగే”. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. “ప్రతిరోజు పండగే” అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో సరికొత్త లుక్లో తేజూ కనిపించనున్నాడు. కాగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి వచ్చిన కుర్ర హీరో సాయి ధరమ్ తేజ్. అనతి కాలంలోనే సుప్రీమ్ స్టార్గా మారిన తేజూ తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు. పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన తేజూ ఈ చిత్రంతో ప్రేక్షకులని అలరించాడు. చిరు పోలికలు కాస్త తేజూలో ఉండడంతో అభిమానులకి ఈజీగా కనెక్ట్ అయ్యాడు. తేజూ నటించిన తొలి చిత్రాన్ని మంచి హిట్ చేశారు. నవంబర్ 14, 2014న పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం విడుదల కాగా, నేటితో ఐదేళ్ళు పూర్తయ్యాయి. అంటే సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా ఐదు సంవత్సరాలు పూర్తి చేశాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్రలహరి వంటి చిత్రాలు తేజూ కెరియర్లో మంచి హిట్ చిత్రాలు అని చెప్పవచ్చు. తన ఐదేళ్ళ కెరియర్లో సాయిధరమ్ తేజ్ మొత్తం 12 చిత్రాలు చేశాడు. తాజా చిత్రం ప్రతి రోజు పండుగే డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.