ఓ వైపు కరోనా, కరోనా స్ట్రెయిన్ అలాగే ఇప్పుడు చలి ప్రజలను వణికిస్తోంది. ఢిల్లీ సహా పలునగరాల్లో అత్యల్పఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు నమోదవుతున్నాయి. జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. స్వెట్టర్లు, రగ్గులు, చలిమంటలతో జనం కాలక్షేపం చేస్తున్నారు. కశ్మీర్లో శీతలగాలులు ప్రమాదకరంగా పరిణమించాయి. కొన్నిరోజుల నుంచి కశ్మీర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శీతలగాలులు, అతి చల్లనివాతావరణంతో కశ్మీర్ వాసులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఇక పలుప్రాంతాల్లో మైనస్ టెంపరేచర్ నమోదవ్వడంతో.. జనం బెంబేలెత్తుతున్నారు. ఇక పర్యాటకానికి పట్టుగొమ్మలాంటి కశ్మీర్లో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. పర్యాటకులు ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు.. శ్రీనగర్ సమీపంలోని దాల్ సరస్సు మంచుగడ్డను తలపిస్తోంది. ఒక్కసారిగా అందులో నీరంతా ఐస్ ప్లేట్గా మారిపోయింది. సరస్సు తీర భాగాలు మంచుగడ్డలు పరిచినట్టుగా కనిపిస్తున్నాయి. దాల్ లేక్లో విహరించాలని అనుకుని వచ్చామని కొందరు పర్యాటకులు తెలిపారు. ఈవిషయంలో నిరాశ ఎదురైనప్పటికీ, సరస్సుగడ్డకట్టడాన్ని చూశామని, ఇదో అద్భుత అనుభూతని వారు తెలిపారు. మరో మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణశాఖ తెలిపింది.