ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూల్ జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టును సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి పి. హర్దీప్ సింగ్ కూడా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణం ఉండేదని, ఇక నుంచి విమాన ప్రయాణం కూడా జరుగబోతుందని తెలిపారు. ఈనెల 28 నుంచి ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖకు విమానాలు అందుబాటులో ఉంటాయని.. ఓర్వకల్లతో రాష్ట్రంలో ఆరో ఎయిర్పోర్టు ప్రారంభమవుతోందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ ప్రకటించారు. అధునాతన అగ్నిమాపక కూడా అందుబాటులో ఉంటుందని.. ఈ గడ్డ నుంచే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చారని తెలిపారు. కాగా.. ఇండిగో సంస్థ ఈ నెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూల్ నుంచి సర్వీసులు నడపనుంది.
previous post