తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చర్చించారు. తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు.
తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు సహాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వానికి కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. యాసంగి సీజన్ లో 50 లక్షల ఎకరాల్లో వరిపంట, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేసే విధంగా నిర్ణీత పంటల సాగు విధానం ఖరారైంది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణీత పంటల సాగుపై సమీక్ష నిర్వహించారు.