తెలంగాణ రాష్టంలో రానున్న రెండేళ్లలో రహదారులన్నీ సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్లో రహదారుల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం తరువాత రహదారులకే అత్యధిక ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన వాటితో సహా 12,751 గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలని సూచించారు. రోడ్లను ప్రభుత్వ శాఖల మధ్య బదిలీ చేసినపుడు వాటి నిర్వహణ విధానం ఖరారు చేయాలన్నారు. రహదారుల ప్రస్తుత పరిస్థితి, వాటిని తీర్చిదిద్దడానికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటు తరువాత రికార్డు స్థాయిలో జాతీయ రహదారులు సాధించుకున్నామని తెలిపారు.
ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో పెద్దఎత్తున రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. పలుచోట్ల రహదారులు, వంతెనలకు మరమ్మతులు, వెడల్పు చేయాలని ఆదేశించారు. కొత్త రోడ్ల నిర్మాణం పూర్తయ్యేవరకు పాడైన రోడ్లను పట్టించుకోకపోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారుల అభివృద్ధి కోసం ఈఎన్సీ నుంచి ఎస్ఈ స్థాయి వరకు అధికారులతో సదస్సు నిర్వహించాలన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రతి రోడ్డు పరిస్థితి సమీక్షించి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
జైలులో జగన్ తో ఉన్నవారికి ఇప్పుడు పెద్ద పదవులు: చంద్రబాబు