టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రవిప్రకాశ్ ఆచూకీ కోసం సైబరాబాద్ పోలీస్ లు గాలింపు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలోహైదరాబాద్ లో మరో ఫోర్జరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొందరు కేటుగాళ్లు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.
ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. గచ్చీబౌలిలోని 44/p సర్వే నంబర్ లో ఉన్న ఓ స్థలం కొనుగోలు కోసం ఏకంగా కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. కేసీఆర్ సంతకంతో సిఫారసు లేఖను సంబంధిత శాఖకు పంపించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహ్మద్ ఉస్మాన్ సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.