కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన పన్నుల వాటాను తప్ప అదనంగా ఎలాంటి సహకారం అందడం లేదని ఆయన మండిపడ్డారు. ఆదివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. కేంద్రం 24 రూపాయిలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
వచ్చే ఐదేళ్లలో ఆదాయ, వ్యయాల అంచానా రూ.10 లక్షల కోట్లని కేసీఆర్ పేర్కొన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు రూ.2 లక్షల 40 వేల కోట్లని, అప్పు చెల్లిస్తే మళ్లీ రూ.లక్షా 30వేల కోట్లు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై దాదాపు రూ.లక్షా 20 వేల కోట్ల ఖర్చు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, ప్రాజెక్టుల తర్వాత రహదారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని కేసీఆర్ అన్నారు.