telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్‌ దత్తపుత్రిక నిశ్చితార్థం..

కన్నతండ్రి, పినతల్లి వేధింపులతో చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చేరిన ఆ అమ్మాయి గోడు విని చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆమెను తన దత్తపుత్రికగా ప్రకటించారు. సంరక్షణ బాధ్యతను ఐఏఎస్‌ అధికారి రఘునందన్‌రావుకు అప్పగించారు. ఆయన పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆమె యోగక్షేమాలను చూస్తోంది. ఐదేళ్లలో ఆరోగ్యపరంగా, విద్యాపరంగా ఎదిగిన ప్రత్యూష.. తనకు నచ్చిన వ్యక్తితో కొత్త జీవితాన్ని పంచుకోబోతున్నారు. రాంనగర్‌ ప్రాంతానికి చెందిన చరణ్‌రెడ్డితో ఆమె నిశ్చితార్థం జరిగింది. మమత, మర్‌రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ప్రత్యూష గురించి తెలుసుకున్న ఆయన.. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సంప్రదించగా ఆమె అంగీకరించారు. సమాచారాన్ని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ఉన్నతాధికారులకు చేరవేశారు. వారు విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆమెను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. ప్రత్యూష పెళ్లాడబోయే యువకుడి వివరాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. నిశ్చితార్థానికి వెళ్లమని మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ డి.దివ్యను ఆదేశించారు. ఈ క్రమంలో కమిషనర్‌ వేడుకను పర్యవేక్షించారు. ప్రత్యూష నర్సింగ్‌ కోర్సు పూర్తిచేసి, ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. తన వివాహానికి కచ్చితంగా వస్తానని కేసీఆర్‌ చెప్పారని..ముఖ్యమంత్రి అండతో కోలుకున్నానని, మంచి కుటుంబంలోకి వెళుతున్నందుకు ఆనందంగా ఉందని ప్రత్యూష పేర్కొన్నారు.

Related posts