ఏపీ సీఎం జగన్ స్పందన కార్యక్రమంపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చడానికి సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ ఇసుక రవాణ చేస్తామంటూ ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీకు ఎవరు ముందుకు వచ్చినా వారిని ఆ బాధ్యతను అప్పగించాలన్నారు.
కిలోమీటర్కు రూ.4.90 చొప్పున ఎవరు ముందుకు వచ్చినా రవాణా కోసం వాహనాలను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. దీనిని అదునుగా తీసుకుని ఇసుక అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఇవ్వద్దని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్లను ఓపెన్ చేయాలని సూచించారు. జిల్లాలో ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జేసీ స్థాయి అధికారికి అప్పగించాలన్నారు. ఆ అధికారి కేవలం ఇసుక సరఫరా, రవాణాలను మాత్రమే చూడాలని సూచించారు.