ఏపీ సీఎం జగన్ శనివారం కర్నూలు జిల్లా ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతాల్లో పర్యటించి ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావం, సహాయ చర్యలు, పునరావాసంపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నంద్యాల పట్టణంలో వరదనీరు చుట్టుముట్టింది. పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూనది ఉప్పొంగి ప్రవహించడంతో పీవీనగర్, హరిజనపేట తదితర కాలనీలు జలమయమయ్యాయి. పైనుంచి వస్తున్న వరదనీరు అంతా నంద్యాలలోని కుందూనదిలో కలుస్తుండటంతో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. మద్దిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో వరదనీరు నిలిచింది.