తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులకు గురవుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుత రాష్ట్రమంతా సిద్ధిపేట మోడల్ అమలు చేస్తానంటున్న కేసీఆర్ దుబ్బాకలో యూరియా కోసం రైతు చనిపోయిన ఘటన చూసి సిగ్గుపడాలని తీవ్రంగా విమర్శించారు. డబ్బు పెట్టి కొందామన్నా యూరియా దొరకడం లేదని వాపోయారు.
రైతు బంధు, రుణమాఫీ పథకాలను అమలుచేయకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు. ఎన్నికల వేళ హడావిడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడం దుర్మార్గమన్నారు. రైతులకు ఇవ్వాల్సిన 20 వేల కోట్లు ఇంకా విడుదల చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని గుర్తు చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి వంటి అంశాలపై పార్టీ అధ్వర్యంలో పోరాడుతామని చెప్పారు.