తెలంగాణలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్నిసీఎం కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ విపరీత చర్యల కారణంగా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందని పేర్కొన్నారు. ఒక పార్టీలో గెలుపొంది అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలంతా మోసగాళ్లేనని భట్టి అన్నారు. కేసీఆర్ ఒక రాజకీయ ఉగ్రవాది అని.. పార్టీ మారిన వాళ్లంతా 420లు అని పేర్కొన్నారు.
కేసీఆర్ ఒక రాజకీయ ఉన్మాదిలా మారిపోయి అన్ని పార్టీలను, అధికార బలంతో తనలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి 420 నాయకుల వల్ల ప్రజాస్వామ్యం, రాజ్యాంగం భ్రష్టు పడుతోందన్నారు.కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, అభిమానంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తేఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేశారన్నారు. ఇటువంటి మోసగాళ్లు చట్ట సభల్లో ఉండేందుకు అర్హత లేదన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్కు 72వేల మంది ప్రజలు ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసి టీఆర్ఎస్ లో చేరారు అని అన్నారు.