ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే హైద్రాబాద్ కంటే అభివృద్ధిలో మించిపోనుందని సినీ నటి దివ్యవాణి అన్నారు. గురువారం ఓ తెలుగు న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ చీఫ్, జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న శూర్పణఖ, రావణసురులను ఓడించాలని ఆమె వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధికి నగరిలో ఉన్న ఓ శూర్పణఖ, రావణసురుడు అడ్డుపడుతున్నాడని రోజా, జగన్లను ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వైసీపీకి ఓటేస్తే మోడీ, కేసీఆర్కు వేసినట్టేనని దివ్యవాణి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాకు ఈ ఇద్దరూ కూడ అడ్డుపడుతున్నారని ఆమె విమర్శించారు. ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని ఆమె ప్రజలను కోరారు. వివేకానందరెడ్డి హత్యలో వాస్తవాలు తెలుసుకోకుండా జగన్ మాట్లాడడం దారుణమని అభిప్రాయపడ్డారు. స్వంత బాబాయ్ను కాపాడుకోలేని జగన్ ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుతారని ఆమె ఎద్దేవా చేశారు.