ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా రైలు టికెట్లపై ప్రధాని మోదీ ఫొటోతో ఉన్న టికెట్లు జారీ చేయడంపై ఇప్పటికే ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మోదీ పిలుపునిచ్చిన ‘మైభీ చౌకీదార్’ నినాదం టీకప్పులపై వెలిసింది. ఈసారి శతాబ్ది ఎక్స్ప్రెస్లో బీజేపీ ఎన్నికల నినాదమైన మై భీ చౌకీదార్ కప్పుల్లో ప్రయాణికులకు చాయ్ ఇవ్వడం వివాదానికి కారణమైంది.
ఓ ప్రయాణికుడు ఈ ఫొటోను ట్వీట్ చేస్తూ.. ఇది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడం కాదా అని ప్రశ్నించాడు. దీనిని ఎన్నికల సంఘానికి కూడా ట్యాగ్ చేశాడు. దీంతో ఈ ఫొటో కాస్తా వైరల్గా మారింది. దీంతో వెంటనే రైల్వే శాఖ ఆ కప్పులను తొలగించింది. సదరు కాంట్రాక్టర్తోపాటు సూపర్వైజర్కు కూడా జరిమానా విధించాం అని రైల్వే శాఖ స్పష్టం చేసింది. సంకల్ప్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కప్పుల్లో టీ అందించినట్టు తెలిసింది.