వేల కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారి మెహుల్ చోక్సీకి, షాక్ ఇచ్చింది ఆంటిగ్వా ప్రభుత్వం. భారత్కు అప్పగించాలని ఆదేశ ప్రధానికి అభ్యర్థించడంతో చోక్సీని ఇండియాకు పంపుతామని చెప్పారు. ఇందుకోసం న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ తెలిపారు. కరేబియన్ దీవుల్లోని ట్విన్ స్టేట్స్గా పిలువబడే ఆంటిగ్వా బార్బుడా రాష్ట్రాల్లో మెహుల్ చోక్సీ పెట్టుబడులు పెట్టారన్న దాంతో వివాదాస్పద సిటిజెన్షిప్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ కింద నవంబర్ 2017లో మెహుల్ చోక్సీకి పౌరసత్వం కల్పించారు.
మెహుల్ చోక్సీకి పౌరసత్వం ఇచ్చిన మాట వాస్తవమే అని అయితే అతని గురించి తెలిశాక ముందుగా అతని పాస్పోర్ట్ను రద్దు చేస్తున్నామని త్వరలో భారత్కు అప్పగిస్తామని ప్రధాని గాస్టన్ బ్రౌన్ తెలిపారు. మరోవైపు నేరగాళ్లకు ఆంటిగ్వా ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయం కల్పించబోదని ప్రధాని బ్రౌన్ తెలిపారు. అందులోను ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని అస్సలు ఎంటర్టెయిన్ చేయమని చెప్పారు.